బడ్జెట్‌లో బీసీల గొంతు కోశారు.. రూ. 20 వేల కోట్ల బడ్జెట్ ఏమైంది?: గంగుల కమలాకర్

  • రాష్ట్ర బడ్జెట్‌లో అంకెల గారడీ తప్ప మరేం లేదన్న గంగుల
  • బీసీ ఆత్మగౌరవ భవనాల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు
  • కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శ

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ అంకెల గారడీ తప్ప ఏమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన, ప్రభుత్వం బీసీలను పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. గతంలో బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పిన కాంగ్రెస్, ఈ బడ్జెట్‌లో వారిని మోసం చేసిందని ఆరోపించారు.


బీసీలకు కేటాయించాల్సిన రూ. 20 వేల కోట్ల బడ్జెట్ ఏమైంది? అని గంగుల ప్రశ్నించారు. కేవలం రూ. 12,511 కోట్లు మాత్రమే కేటాయించి బీసీల గొంతు కోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన బీసీ ఆత్మగౌరవ భవనాల భూములను ప్రస్తుత ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.


ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా అబద్ధాలు చెబుతోందని గంగుల కమలాకర్ విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇచ్చిందని ఇంతకు ముందు ఒక మంత్రి చెప్పారని, ఇప్పుడు మాత్రం కేసీఆర్ హయాంలో కార్డులు ఇవ్వలేదని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పుడు మొహం చాటేశారని... ఇది ప్రజల చెవిలో పువ్వు పెట్టడమే అని విమర్శించారు.

Gangula Kamalakar
Telangana Budget 2024-25
BC Welfare
BRS MLA
Congress Government
KCR Government
Kalyana Lakshmi
Telangana Assembly

More Telugu News